గ్రామీణ వ్యవస్థను జగన్ నిర్వీర్యం చేశారు: బీసీ జనార్ధన్ రెడ్డి
- బనగానపల్లెలో గ్రామసభ నిర్వహించిన జనార్ధన్ రెడ్డి
- వైసీపీ హయాంలో బలగానపల్లెలో అభివృద్ధి శూన్యమని విమర్శ
- బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని వైసీపీ నిలిపేసిందని మండిపాటు
బనగానపల్లెలో నిర్వహించిన గ్రామసభలో రాష్ట్ర రోడ్డు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బ్రహ్మంగారు నడయాడిన పవిత్రమైన బనగానపల్లెలో గత ఐదేళ్ల వైసీపీ హయాంలో అభివృద్ధి శూన్యమని, కేవలం అరాచక పాలనే సాగిందని మండిపడ్డారు. వైసీపీ పాలనలో జగన్ గ్రామీణ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని విమర్శించారు.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని వైసీపీ నిలిపివేసిందని, తాము మళ్లీ అధికారంలోకి వచ్చాక 70 శాతం పనులు పూర్తి చేశామన్నారు. అలాగే 41 కిలోమీటర్ల అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులను కూడా పూర్తి చేశామని వెల్లడించారు. ఐదేళ్లలో రాయలసీమ కోసం వైసీపీ ఏం చేసింది? తామేం చేశామో ప్రజల సమక్షంలో బహిరంగ చర్చకు తాము సిద్ధమని... దమ్ముంటే చర్చకు రావాలంటూ మంత్రి సవాల్ విసిరారు.